26, మార్చి 2010, శుక్రవారం

మా జొస్నా పాప

మా జోస్నా పాప ఈ మద్దెనే నడుస్తా ఉంది.అది ఒక్కటే చెయ్యి ముందుకూ ఎనక్కీ ఊపుకుంటా సొరిగి సొరిగి,నడుస్తా ఉంటే అందరూ చెయ్యి బో ఊపతా ఉందబ్బా పిల్ల అని  అంటా ఉండారు.అది శివరాతిరి రోజు పుట్టిందంట.ఆ యాల యాడ జూసినా గుగ్గిల్లే.పిల్లొల్లకయితే బో పండగ.మొన్న పండక్కయితే మాజేజి అలసంద గుగ్గిల్లు చేసింది.
మా జోస్నాపాపకు పుట్టిన రోజు గూడా ఆయాలనే చేసిండ్రు.కొండంత పండగ రోజు పుట్టింది కదా, ఇంక వేరే రోజుల్లో చేసేదెందుకులెమ్మని మా మగేసు మామ ఆయాలనే ఆయమ్మికి పుట్టినరోజు చేసిండు.మా బబ్బు గానికయితే బాగ అందర్నీ పిలిసి,కేకు కోసి,బోజినాలు పెట్టించి చేసిండ్రుగాని ఆయమ్మికయితే అయ్యన్నీ ఏమీ చేయల్యా.ఊరికనే కొత్త గుడ్డలు తొడిగిచ్చిండ్రు.మా అత్త అడిగిందంట గాని,ఆ...ఏమిలే ....అన్నడంట మా మామ.దాని  పుట్టిన్రోజు శివరాత్రి పండగలో కలిసి పోయింది.
మా జోస్నా పాప పుట్టినప్పుడు మాయత్త మానాయన్ని ముద్దుగా పిల్చుకోనీకి,పేరు పెట్టమని అడిగిందంట.మా బబ్బుగానికి కూడా మానాయినేనంట పేరు పెట్టింది.వాని అసలు పేరు ఫణి గాడయితే,అందరూ బబ్బు,బబ్బు అనేదే వాడికయింది.అట్టనే ఏదన్నా పేరు పెడతడు గదాని మాయత్త మానాయిన్ని అడిగిందంట.అప్పుడు మా నాయిన దానికి దూదు అని పెట్టమ్యా అన్నడంట.దానికి మాయత్త ఒప్పుకోనే లేదంట.మా నాయిన ఇప్పటికీ ఆ సంగతి చెబుతా ఉంటాడు.
దూదు అనే పేరు అచ్చిరాదని మాయత్త ఆపేరు పెట్టలేదంట.దూదూ అనే పేరు మేము పల్లెలో ఉండంగ,నేను పుట్టక  మునుపు, ఎప్పుడో చానా రోజుల కిందట మా నాయిన ఒక కుక్క పిల్లకు పెట్టిండంట.ఒకపారి బాగా వాన కురుస్తున్నదంట.దూదూ తల్లి దాన్ని వదిలి పెట్టి యాడికో పోయిందంట. అప్పుడు అది ఏడ్సుకుంటా,తిరుగుతా,తిరుగుతా మురుక్కాలవలో పన్నదంట.మానాయిన సూసి,దాన్ని సుబ్రంగ తుడిసి, ఇంట్లో పెట్టుకున్నడంట.అపుడు దానికి నడిసేది కూడా రాకుండున్నదంట.అప్పుడే దాని కి దూదూ అన్న పేరు పెట్టిండంట మా నాయిన.దూదేంది నాయినా, అంటే మానాయిన ఒక కత చెప్పుకొచ్చిండు.
ప్యారీసు పతనం అని ఒక బుక్కున్నదంట. దాంట్లో కతలో, ఒకచిన్న బాబుంటడంట.వాని పేరు దూదంట.వానమ్మ వాన్ని బాగాపెంచుతా ఉండేదంట.వాడు బళే ముద్దుగుంటడంట.ఆ పేరు మానాయినకు నచ్చి కుక్క పిల్లకుగూడా ఆ పేరే పెట్టిండంట. అయితే ఉండంగుండగా,దూదు అమ్మకు పిచ్చి పట్టిందంట.చచ్చిపోయిందంట.అమ్మ లేకపోయేటాలికి,దూదుకూ పాలే లెవ్వంట.అప్పుడు మానాయిన దాన్ని సాకిండంట.ఒకపారి అది ఒక దుడుకు పని చేసిందంట.అది చెప్తే బో నవ్వొచ్చది.పల్లెలో మేమున్న ఇంటికి దగ్గర్నే నాయంత ఉండే పిల్లొల్లు,దూరంగా పోలేరుకదా_అట్టాటోల్లంత జియ్య కూచ్చునేటోల్లంట.ఒకపారి ఒక పిల్లోడు జియ్య కూచ్చుంటూంటే మా దూదు వాని కాడికి పొయ్యి, అట్ట మూచ్చూసి,ఇట్ట మూచ్చూసి వాని బెల్లం కొరికిందంట.వాడు బయపడి దిక్కు తెలియకుండా ఏడ్చిండంట. ఇది జరిగినాక వాని అమ్మా నాయినా బో కొట్లాడుకున్నరంట. పిల్లోన్ని ఇడిచి పెట్టి పోతవాని, పెండ్లాం మీద బలే తగాదాడిండంట ఆయన.
ఇట్ట పెరుగుతా ఉండంగ, దూదూకు గూడా  పిచ్చెక్కిందంట.ఇంగ పట్టిచ్చుకునే వాల్లు లేక,చివరకు అట్ట తిరిగి ,ఇట్ట తిరిగి లారీ కింద పడి చచ్చి పోయిందంట.ఇదంతా చెప్పి,అందుకే నేను ఆపేరు వద్దనింది, అంటది మాయత్త.
ఆ పుస్తకంలో దూదూ కత గూడ ఇంతే అయితదంట.వాడు చివరకు,వాని అమ్మ చూస్తా ఉండంగనే,జబ్బు చేసి చచ్చిపోతడంట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి